ఆర్ట్ టైమ్స్ : కోలీవుడ్ లో మెగాఫోన్ పట్టి, ఆపై హీరోగా మారిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఆ కోవలోనే త్వరలో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు మరో దర్శకుడు ఇసక్కి కార్వణ్ణన్. ఆ చిత్రం పేరు ‘ఆట్టి’. కిట్టు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఐదుగురు విప్లవాత్మక మహిళల నేపథ్యంతో సాగే కథ ఇది. ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పరమశివన్ ఫాతిమా’ చిత్రానికి ఇసక్కి దర్శకత్వం వహించి, ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఆ చిత్రంలో అతని నటనకు ప్రసంశలతో పాటు హీరోగా నటించే అవకాశం కూడా వచ్చింది. ‘ఆట్టి’లో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

‘అయలి’ ఫేమ్ అభి నక్షత్ర హీరోయిన్. కాదల్ సుకుమార్, సౌందర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చారిత్రక సంఘటనల ఆధారంగా తమిళ గిరిజన దేవతల ప్రాముఖ్యతను ఈ చిత్రంలో చూపించాబోతున్నారు. ఊటీ, కూనూర్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలలో చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం తుది దశ పనులు జరుగుతున్నాయి, త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థీసన్ సంగీతం, సి.పి.సదాశివం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.



