ఆర్ట్ టైమ్స్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చిత్రకళ బోధనను తప్పనిసరి చేసి, ఉపాధ్యాయులను నియమించాలని విశాఖపట్నంకు చెందిన సీనియర్ చిత్రకారులు, కళారత్న అవార్డు గ్రహీత సుంకర చలపతిరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై చలపతిరావు ఒక ప్రకటన విడుదల చేస్తూ, “దేశ ఔన్నత్యం ఆ దేశ కళలు, సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. అలాంటి కళలలో చిత్రకళ కూడా వుంది. న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం, అడవి బాపిరాజు, ఎస్వీ రామారావు, కృష్ణారెడ్డి, వడ్డాది పాపయ్య, బాపు, బి.ఎ రెడ్డి వంటి గొప్ప చిత్రకారులెందరో ఈ కళకు ప్రపంచ కీర్తి తెచ్చారు. అయితే విద్యారంగంలో చిత్రకళకు తగు ప్రాముఖ్యత కల్పించడం లేదు. 1989 నుండి చిత్రకళ ఉపాధ్యాయుల నియామకం జరగలేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఉన్నత పాఠశాలల్లో చిత్రకళ ఉపాధ్యాయులను నియమించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.



